ఆల్ జైదీకి ఈజిప్టు వధువు?
బగ్దాద్: అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పైకి బూట్లు విసిరి హీరో అయిన జర్నలిస్టు ముంతాజర్ ఆల్ జైదీకి తన 20 ఏళ్ల కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఈజిప్టు వ్యక్తి ఒకరు ముందుకు వచ్చారు. ఆల్ జైదీని పెళ్లి చేసుకోవడానికి ఆ వ్యక్తి కూతురు అమల్ సాద్ గుమా కూడా అంగీకరించింది. అది తనకు గౌరవమని, తాను ఇరాక్ లో జీవించాలని అనుకుంటున్నానని, పైగా ఆ హీరోతో కలిసి జీవించడం గౌరవమని ఆమె అంటోంది. సాద్ గుమా తండ్రి జైదీ సోదరుడితో తన ఆలోచన గురించి చెప్పారు.
ఇదిలా వుంటే, జైదీ క్షమాపణ కోరినట్లు ఇరాక్ ప్రధాని కార్యాలయం అధికార ప్రతినిధి చెప్పారు. తను అనుచితంగా ప్రవర్తించానని, తనకు క్షమాపణ ప్రసాదించాలని జర్నిలిస్టు ప్రధాని నౌరీ అల్ - మాలికీకి గురువారం లేఖ రాసినట్లు ప్రధాని కార్యాలయం అధికార ప్రతినిధఇ యాసిన్ మజీద్ చెప్పారు. బుష్ పైకి విసిరిని బూట్లను భద్రతా ఏజెంట్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. బూట్లలో పేలుడు పదార్థాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఇరాకీ, అమెరికా భద్రతా సిబ్బంది పరిశీలించి వాటిని ధ్వంసం చేశారు. ఆ బూట్లను కోటి మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి సౌదీ అరేబియా వ్యక్తి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.