జీతం 30 వేలు, ఆస్తులు 125 కోట్లు!
హైదరాబాద్:మత్స్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యనారాయణ అక్రమ ఆస్తుల విలువ 125 కోట్ల పై మాటేనని ఎసిబి అంచనా వేసింది. సూర్యనారాయాణకు అప్పటి కేంస్రమంత్రి కె. చంద్రశేఖరరావు, రాష్ట్ర మంత్రులు మండలి బుద్ద ప్రసాద్, ముఖేష్ గౌడ్, షబ్బీర్ అలి, ఎం హనుమంతరావు, బొత్స సత్యనారాయణ, దామోదర్ రాజ నర్సింహ సహరించినట్టు వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ప్రమేయంపై కూడా వార్తలు వస్తున్నాయి. జీతం 30 వేల లోపే అయినా వంద కోట్ల ఆస్తి ఎలా వచ్చి పడింది?
ఎవరికీ అంతగా తెలియని మత్స్యశాఖలో ఇంతటి తిమింగలం ఉందన్న విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. డైలీ వేజ్ ఉద్యోగిగా చేరి, తర్వాత మత్స్య శాఖలోకి డిప్యుటేషన్ మీద వెళ్ళిన సూర్యనారాయణ ఇన్ని శాఖలను ఇంత మంది మంత్రులను , ఇంత మంది ఐఎఎస్ ఆఫీసర్లను ఎలా దారికి తెచ్చుకున్నాడన్నది అర్ధం కావడం లేదు. సూర్యనారాయణను అరెస్టు చేసి జైలుకు తరలించారు. పెద్దల పేర్లు సూర్యనారాయణ నోటి నుంచి ఇప్పటి వరకు బయటకు రాలేదు.