బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు TGSRTC బంపర్ ఆఫర్..!!
TGSRTC హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి మరింత మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కీలక ప్రకటన చేసింది. సాయంత్రం ఆరు గంటల తరువాత హైదరాబాద్ - బెంగళూరు సర్వీసుల్లో శంషాబాద్ వరకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రద్దీ సమయాల్లో ఈ నిర్ణయం ప్రయోజనకరంగా మారనుంది.
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రయాణీకుల కోసం ఈ నిర్ణయం అమలు చేయనుంది. సిటీ ట్రాఫిక్లో చిక్కుకుని ఎంజీబీఎస్ బస్టాండ్ చేరుకోవడానికి పడే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఒక అద్భుతమైన ఫ్రీ పుష్పక్ ఏసీ ఫీడర్ సర్వీసును ప్రవేశపెట్టింది. తాజా నిర్ణయం మేరకు సాయంత్రం 6 గంటల తర్వాత బయలుదేరే హైదరాబాద్-బెంగళూరు సర్వీసుల్లో శంషాబాద్ (ఆర్జీఐ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) బోర్డింగ్ పాయింట్గా టికెట్ రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు శంషాబాద్ వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆయా ప్రయాణికులను ఏసీ, పుష్పక్ బస్సుల్లో శంషాబాద్ వరకు ఉచితంగా తీసుకెళ్తామని వెల్లడించింది.

ప్రయాణీకుల కోసం తాజా నిర్ణయం
నగరంలో ట్రాఫిక్ సమస్యల కారణంగా మియాపూర్, నిజాంపేట్, జేఎన్టీయూ, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్, లింగంపల్లి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందుగా ఎంజీబీఎస్ చేరుకునేందుకు హైదరాబాద్ ట్రాఫిక్లో 2గంటలకు పైగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు శంషాబాద్ వరకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు. అయితే, ప్రయాణీకులు తమ బెంగళూరుకు ప్రయాణానికి రిజర్వేషన్ చేసుకునే సమయంలో శంషాబాద్ బోర్డింగ్ పాయింట్ను ఎంపిక చేసుకోవాలి. రిజర్వేషన్ టికెట్ చూపించి AC, AJ లేదా AK పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ ఏసీ సర్వీసుల్లో క్రింది బోర్డింగ్ పాయింట్లలో ఏదైనా ఒక చోటు నుండి శంషాబాద్ వరకు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. తర్వాత అక్కడ తమకు రిజర్వేషన్ ఉన్న బెంగళూరు సర్వీసు బస్సు ద్వారా ప్రయాణం సాగించవచ్చని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications