గౌహతి ప్రేలుళ్ళు..ఏడుగురు మృతి
గౌహతి : కొత్త సంవత్సర సంబరాలు ముగియకుండానే అసోం రక్తమోడింది. ఉల్ఫా తీవ్రవాదులు భారీ విధ్వంసమే లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ దాడిలో ఏడుగురు మరణించగా.. సుమారు 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లు సంభవించన కొద్దినిమిషాలకే కేంద్ర హోమంత్రి చిదంబరం గౌహతీలో పర్యటించడం గమనార్హం. రెండు నెలల క్రితం ఆ రాష్ట్రంలో సంభవించిన పేలుళ్లలో సుమారు 90మంది దుర్మరణం పాలైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు చిదంబరం అసోంలో పర్యటిస్తున్నారు.
గౌహతి-షిల్లాంగ్ రహదారిలో అత్యంత రద్దీగా ఉండే భంగాగఢ్ మార్కెట్ సమీపంలో పైదారి (ఫ్త్లెఓవర్) వద్దనున్న మిఠాయి దుకాణం (స్వీట్స్టాల్) దగ్గర్లో సాయంత్రం 6.00 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 35 మంది గాయపడ్డారు. భూత్నాథ్ ఏరియాలో 5.30గంటలకు సైకిల్ బాంబు పేలడంతో ఇద్దరు మరణించగా.. 12 మంది గాయపడ్డారు. వాస్తవానికి చిదంబరం కాన్వాయ్ ఈ దారిలోనే వెళ్లాల్సి ఉంది. అంతకుముందు 3.15 గంటలకు బిరుబారిలో సంభవించిన పేలుడులో ముగ్గురు గాయపడ్డారు. చెత్తతొట్టెలో బాంబులు అమర్చడంతో ఈ ప్రమాదం సంభవించింది.
పేలుళ్లు సంభవించిన ప్రాంతాలు రక్తపు మడుగులతో నిండిపోయాయి. గాయపడిన వారిలో చిన్నారులూ ఉన్నారు. జనవరి మూడు నుంచి మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో జరగనున్న 96వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ప్రారంభించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం అసోంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటకు ముందురోజు మేఘాలయకు 95 కిలోమీటర్ల దూరంలోని గౌహతి ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లనేపథ్యంలో హోంమంత్రి చిదంబరం కాన్వాయ్ని వేరే రహదారిగుండా మళ్లించారు.గౌహతి పేలుళ్లను ప్రధాని మన్మోహన్సింగ్, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఖండించారు.