"జనానికి నమ్మకం పోయింది-అదొక్కటే మందు..!"-రాజకీయపార్టీపై తేల్చేసిన అభిజీత్..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం పట్టుబట్టి ఉద్యమాలతో దాన్ని సాధించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇప్పుడు తదుపరి కార్యాచరణకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రంలోని శంభాజీనగర్ లో సీజేపీ సభ్యులు ఇవాళ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయాల్లోకి వస్తుందా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో సీజేపీ బాస్ అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన అభిజీత్.. రాజకీయ వ్యవస్థ అయినా, న్యాయవ్యవస్థ అయినా, మీడియా అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా. ఈ అన్ని సంస్థలపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని తెలిపారు. తమ ఉద్యమానికి వచ్చిన మద్దతే ఇందుకు నిదర్శనం అన్నారు. అది కేవలం విద్యకే పరిమితం కాలేదని, ఉద్యమం పెరిగే కొద్దీ, ఈ అన్ని సంస్థలపై ప్రజల నమ్మకం తగ్గిందని, ఆ కోపం కనిపిస్తోందని పేర్కొన్నారు. అది జంతర్ మంతర్తో పాటు ముంబైలో, బెంగాల్లో, చెన్నైలో, ఇలా దేశమంతటా కనిపించిందన్నారు.

అందుకే ఈ అన్ని సంస్థల్లో బాధ్యతను తిరిగి తీసుకురావడానికి, ఎక్కడో ఒకచోట ఈ సంస్థల్లో మళ్లీ తటస్థతను తిరిగి తీసుకురావడానికి ఒక ప్రజా ఉద్యమం అవసరమని, ఒక ప్రజా ఒత్తిడి అవసరమని తమకు అనిపిస్తోందని అభిజీత్ తెలిపారు. అలాగే రాజకీయ పార్టీగా మార్పుపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ. రాజకీయ వ్యవస్థ పరిస్థితి చాలా చండాలంగా ఉందని , ఉదయం ప్రజలు ఎవరో ఒకరిని ఎంచుకుంటారని, సాయంత్రానికి ఇంకొకరి ప్రభుత్వం ఏర్పడిపోతుందని, ఉదయం ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక పార్టీని ఎంచుకుంటారని, సాయంత్రానికి ఇంకొక పార్టీలో ఉంటారని, అదీ లేకపోతే వాళ్లు పూర్తిగా తప్పుకుంటారన్నారు.

#WATCH | Chhatrapati Sambhaji Nagar, Maharashtra | On being asked if he will start a political party, Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke says, "Our movement was successful because people rose above their own ideologies and political party lines to come together… pic.twitter.com/xQqgNBjzKk
— ANI (@ANI) August 5, 2026
ఇవన్నీ లేకపోతే ఈడీ, సీబీఐలను పంపించి తమకు కావాల్సిన పార్టీల్ని చీలుస్తారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అలాంటి పరిస్థితిలో ప్రజలు ఈ విషయాలన్నింటిపైనా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే తమ ప్రజా ఉద్యమానికి మద్దతు వచ్చిందన్నారు. అందరూ తమ సిద్ధాంతాల మీద నిలబడి రాజకీయ పార్టీల్ని కాదని కలిసి వచ్చారని, దేశంలో జరుగుతున్న ఈ విషయాలన్నింటిపై, ఇప్పుడు తప్పుడు మార్గాల్లో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న వాళ్లకు వ్యతిరేకంగా కలిసి వచ్చారన్నారు. ఇప్పుడు భారత్ లో ఓ ప్రజా ఉద్యమం నడుస్తుందని, ఒక సామాజిక ఉద్యమం నడుస్తుందని దిప్కే చెప్పుకొచ్చారు.














Click it and Unblock the Notifications