మా భయంతోనే ఇవన్నీ: అల్లు అరవింద్
చిరంజీవి రక్తనిధి కేంద్రాన్ని విమర్శిస్తున్నవారికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. తనతో వస్తే బ్లడ్బ్యాంకుకు సంబంధించిన వివరాలన్నింటినీ అందజేస్తామని చెప్పారు. శనివారమిక్కడ రావినారాయణ ఆడిటోరియంలో క్రాంతిజ్యోతి సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గుంటూరు, ప్రకాశం, మహబూబ్నగర్, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ, బీసీ నేతలు హాజరయ్యారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''అరవై ఏళ్లుగా రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి. వారెప్పుడైనా మునెమ్మలాంటి నాయకురాలిని ముందుకు తీసుకురాగలిగారా'' అని ప్రశ్నించారు. బీసీల దైవం జ్యోతిరావు పూలేను చిరంజీవి ప్రస్తావించడంతో సర్కారు గుండెల్లో గుబులు మొదలైందని విమర్శించారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో రాష్ట్రం నడిబొడ్డున పది లక్షల మంది బీసీలతో ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
-వీళ్లే మా పార్టీ అంబాసిడర్లు: గుంటూరు జిల్లా పశ్యామల గ్రామం నుంచి వచ్చిన ఓ మహిళను అల్లుఅరవింద్ సభకు ప్రత్యేకంగా పరిచయం చేశారు. ''స్వయంశక్తితో ఎదిగి డ్రైవర్గా జీవితం గడుపుతున్న ఈ బీసీ మహిళ రాములమ్మను మీకు పరిచయం చేస్తున్నా'' అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా దాన్ని వదులుకొని, నలుగురికి ఉపాధి చూపుతూ రాములమ్మ తన సొంతకాళ్లపై నిలబడిందని పేర్కొన్నారు. ఇలాంటి వారే తమ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు.