నేను శనినా?: చిరంజీవి

నెల్లూరు జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉన్న చిరంజీని.. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం జిల్లాకు విచ్చేశారు. జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరులలో ప్రజాఅంకిత సభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో చిరంజీవి మాట్లాడుతూ సూళ్లూరుపేట ప్రాంతంలో ఏర్పాటుచేసిన అపాచీ ఫ్యాక్టరీలో కార్మికచట్టాలు అమలు కావట్లేదని దుయ్యబట్టారు.
ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్) పేరుతో ప్రభుత్వం పేదరైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని పెద్దలకు పంచిపెడుతోందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు.అలాగే సామాజిక న్యాయం కోసం ఏర్పడిన పీఆర్పీకి ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్పీకి ఎన్ని ఆంక్షలు విధించినా ముందుకెళ్తామన్నారు. దైవబలం, అభిమానుల బలం ఉన్నంతవరకు ఎవర్నీ లెక్కచేయనని ఆవేశంగా అన్నారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ అన్న మాటల్లో ఎలాంటి తప్పు లేదంటూ శాసనసభ సమావేశాల్లో నేతలు ఒకరినొకరు జంతువులతో పోల్చుకుంటూ అంతకన్నా నీచంగా తిట్టుకుంటున్నారని తమ్ముడి మాటలను సమర్థించారు. ప్రరాపాను ఎంత అణగదొక్కడానికి ప్రయత్నిస్తున్నా అంతగా ప్రజల అభిమానాలతో పైకి ఎదుగుతోందని ప్రకటించారు. ఉదయించే సూరీడుపై ఉమ్మివేయాలని చూస్తే అది వారిముఖానే పడుతుందని విమర్శించారు. అలాగే పొట్టిశ్రీరాములు పుట్టిన ఈ జిల్లాకు రావడం తన అదృష్టమన్నారు. తన తల్లి పుట్టినిల్లయిన ఈ జిల్లాకు విజేయుడనై మళ్లీ తిరిగొస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications