మేటాస్ జాతకం తిరగబడిందా?
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ పతనావస్థకు చేరిన నేపథ్యంలో మేటాస్ కూడా ఆర్థికంగా బలహీనపడిందని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. మేటాస్కు అప్పగించిన హైదరాబాద్ మెట్రో రైలు, కృష్ణా జిల్లా బందరులో ఓడరేవు పథకాలను రద్దుచేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మెట్రో రైలు ఒప్పందానికి సంబంధించి గతంలో ఢిల్లీ మెట్రో రైలు ఎండీ శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలుచేశారు. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో విమర్శలు మళ్లీ చెలరేగితే రాజకీయంగా దెబ్బతింటామన్నది వైఎస్ సర్కారు ఆందోళనగా కనిపిస్తోంది.
108 +104 = 420?
ప్రజారోగ్యాన్ని ప్రైవేటు రంగానికి పణంగా పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆందోళన చెందుతోంది. సత్యం కంప్యూటర్స్కు అనుబంధంగా ఉన్న సత్యం ఫౌండేషన్కు రూ.కోట్ల ఖర్చుతో అంబులెన్సుల నిర్వహణ (108), సంచార వైద్య సేవల (104) బాధ్యతను కట్టబెట్టింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం కేటాయించిన రూ.కోట్లను వీటికి దారి మళ్లించింది. ఆ సంస్థ ఇప్పుడు సంక్షోభంలో మునిగిపోవడంతో తలపట్టుకుంటోంది.
ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల అండదండలుంటే ఎన్ని భారీ ప్రాజెక్టులనైనా చేజిక్కించుకోవచ్చని మేటాస్ నిరూపించింది. చిన్న చిన్న పనులు కూడా చేయలేక చేతులెత్తేసిన ఈ సంస్థకు జలయజ్ఞంలో దరిదాపుగా రూ.14 వేల కోట్ల విలువచేసే పనులు ఇవ్వడమే దీనికి తార్కాణం.
గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలించే భారీ పథకం కూడా ప్రమాదంలో పడింది. రూ.3375 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో 'మేటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్' భాగస్వామిగా ఉన్న కన్సార్టియంకు రూ.809.62 కోట్ల విలువైన పనులను అప్పగించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రూ.33.46 కోట్లతో దక్కించుకున్న వరదనీటి కాలువల నిర్మాణ పనులకూ నీళ్లొదిలినట్లేనా?
అనుమతుల్లేకుండానే 6500 ఎకరాలు! మేటాస్ ఆస్తులపై తాజాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని వద్ద ఉన్నాయంటున్న 6500 ఎకరాలు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల 3000 ఎకరాలు ఉండొచ్చన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలా అనుకున్నా కంపెనీలు పెద్దఎత్తున భూములను కొనుగోలు చేసుకోదలస్తే వ్యవసాయ భూ సంస్కరణల చట్టంలోని గరిష్ఠ పరిమితి నిబంధనల నుంచి మినహాయింపు పొందాలి. ఈ మినహాయింపును మేటాస్కు ఇవ్వలేదని రెవెన్యూ ఉన్నతాధికారులు అంటున్నారు.