రాజు తీవ్రవాది కంటే డేంజర్: విహెచ్
ఆయన నోరువిప్పడం లేదని కాలయాపన చేయడం తగదని పేర్కొన్నారు. ఉగ్రవాదులకో నిబంధన, రామలింగరాజుకో నిబంధన ఉండటం సరికాదని హితవు పలికారు. మహారాష్ట్ర ప్రభుత్వం మేటాస్తో ఒప్పందాలను రద్దు చేసుకున్నందున, రాష్ట్ర సర్కారు కూడా అదే బాటలో నడవాలని డిమాండ్ చేశారు. ''సత్యం కంపెనీలో చిన్న మదుపుదారులు పెట్టిన డబ్బుతో రామలింగరాజు హైదరాబాద్ చుట్టుపక్కల వేల ఎకరాల భూమి కొనుగోలు చేశారు. బంధువుల పేర్ల మీద కంపెనీలు ఏర్పాటుచేసి బినామీ పేర్లతో వ్యవహారం నడిపారు'' అని ఆరోపించారు.
ఇందిరాగాంధీ పెద్దల భూములను లాక్కొని పేదలకు పంచిపెట్టారని, ప్రస్తుతం రాష్ట్రంలో అందుకు పూర్తి వ్యతిరేకంగా జరుగుతోందన్నారు. ''పేదల భూములను పెద్దలు తన్నుకుపోతున్నారు. ఫలితంగా హైదరాబాద్లో పేదలకు 50 గజాల స్థలం కూడా దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల వల్లే నక్సలిజం, పేదరికం పెరిగిపోతున్నాయి. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టిద్దామంటే స్థలమే లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు రామలింగరాజు, ఆయన బంధువుల పేర్ల మీద ఉన్న వేల ఎకరాల బినామీ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. సత్యం కంపెనీ షేర్లు కొని మోసపోయిన చిన్న మదుపుదారులకు పంచిపెట్టాలి. ఉగ్రవాది కాలిస్తే ఒకేరోజులో చనిపోతారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం, పిల్లల చదువుల కోసం సంస్థలో పెట్టుబడి పెట్టిన మధ్యతరగతివారు ఇప్పుడు రోజూ చస్తున్నారు. రెవెన్యూశాఖ స్పందించి రామలింగరాజు కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన బినామీ భూములన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి. కేసును సీరియస్గా దర్యాప్తు చేయాలి. విశాఖపట్నంలో సత్యం సంస్థకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకోవాలి. ఇంత జరిగాక కూడా సత్యం మోసాలను వెనకేసుకొస్తే మేం కూడా ఊరుకోం. ముఖ్యమంత్రిని అడుగుతాం. రామలింగరాజు పాపంలో మనకెందుకు భాగం'' అని పేర్కొన్నారు.