కృష్ణకు అవార్డు: మహేష్ పై ఆశ!
1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున లోక్సభకు పోటీచేసి గెలిచిన కృష్ణ.. ఆ తరువాత 1991లో అక్కడి నుంచే ఓడిపోయారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మూడేళ్ల కిందటి నుంచే కాంగ్రెస్తో మళ్ళీ సత్సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చాలా బాగా పనిచేస్తున్నారని పలు సందర్భాల్లో కొనియాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను బలపరచాల్సిందిగా తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన సోదరుడు జి.ఆదిశేషగిరిరావు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలే కృష్ణకు చెందిన పద్మాలయా భూముల వ్యవహారం వివాదాస్పదమయింది. ఆయనకు లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తనయుడిపై గురి: కృష్ణ తనయుడు మహేశ్ బాబు తమ పార్టీ తరఫున ప్రచారం చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ దిశగా ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్కు యువతలో మంచి క్రేజ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో దాన్ని సొమ్ము చేసుకోవాలని ఆ పార్టీ ఎత్తుగడ. కృష్ణ-మహేశ్ బాబు యువసేనకు కాంగ్రెస్ నేత దిడ్డి రాంబాబు నేతృత్వం వహిస్తున్నారు. సీఎంకు సన్నిహితులైన వ్యక్తులు తెరవెనక ఉండి యువసేన పేరుతో కాంగ్రెస్ అనుకూల కార్యక్రమాలు చేపడుతున్నారు.