ఆ ఆరాటం బాబు కోసమే: వైయస్
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి విద్యుత్ మంత్రి షబ్బీర్ అలీతో అదనపు విద్యుత్ కొనుగోలు, కేంద్రం మద్దతుపై ఫోన్లో చర్చించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఐదేళ్లకు మాట మార్చడం, మిత్రుల్ని మార్చడం పనిగా పెట్టుకున్న సీపీఎం నేత రాఘవులు ఉచిత విద్యుత్ కొనసాగింపుపై విషప్రచారానికి తెర లేపారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏదోవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి తీరాలని రాఘవులు ఆరాటపడుతున్నారని ఎద్దేవాచేశారు. రాఘవులు కలలు కల్లలవుతాయన్నారు.
గత ఐదేళ్లుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా 30లక్షల రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు రెండుకోట్ల మంది వినియోగదారులకు కరెంటు ఛార్జీలు పెంచలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తమ విశ్వసనీయతకు నిదర్శనమని, రాఘవులు చెబుతున్నట్లు ఉచిత విద్యుత్తు పథకం నీరుగార్చడం తమ హయాంలో జరగదని ఆయన అన్నారు.