పులివెందులపై 'కన్ను': ఇసి మాజీ
విశాఖపట్నం: రాబోయే ఎన్నికల్లో ముఖ్యనేతలు పోటీచేసే అన్ని నియోజకవర్గాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలను ఏర్పాటుచేస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే వీలు ఉంటుందని భారత ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు సూచన చేశారు. ఆయన మరీ ముఖ్యంగా సిఎం రాజశేఖరరెడ్డి నియోజకవర్గమైన పులివెందుల ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ గతంలో ఎన్నో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు.
ఎన్నికల నిఘా వేదిక సభ్యుడు కూడా అయిన ఆయన 25 స్వచ్ఛందసంస్థలతో కలిసి ఆవిర్భవించిన నిఘావేదిక ఈ ఎన్నికల్లో తప్పక కొంద మార్పు తెస్తుందని అన్నారు. అన్ని నియోజకవర్గాల పరిధిలో స్థానికులతో వేదిక కమిటీలు ఏర్పాటవుతున్నాయని, వీరికి ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఓటర్ల జాబితా పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నిఘా వేదికను ప్రజా ఉద్యమంగా తీర్చి దిద్దుతామని అన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే రాజకీయపార్టీలు నేరస్తులకు టిక్కెట్లు ఇవ్వరాదని ఆయన కోరారు. సార్వత్రిక ఎన్నికలకు రేపు, ఎల్లుండిలో ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.