సిఎంగా 20న వైయస్ ప్రమాణం
బుధవారం రాత్రి ఏడుగంటలకు వై.ఎస్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. 2004లో మాదిరిగానే మంత్రివర్గంలో ముఖ్యమంత్రి ఒకరే బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమం కోసం ఎల్బీస్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎల్పీ నేత ఎన్నికకు ఏఐసీసీ తరఫున పరిశీలకుడిగా సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడు వీరప్పమొయిలీ హాజరవుతారు.
ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకార ఏర్పాట్లను కేవీపీ రామచంద్రరావు, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, ముఖేష్, కిరణ్కుమార్రెడ్డి, ఎంపీ అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు వట్టి వసంత్కుమార్, శంకర్రావు, దానం నాగేందర్, సుధీర్రెడ్డి తదితరులు సమీక్షించారు. అంతకు ముందు భద్రత ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా.రాళ్లబండి కవితాప్రసాద్ వెల్లడించారు.
ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎన్నికైన 157 మంది ఎమ్మెల్యేలు, 33 మంది లోక్ సభ సభ్యులను పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అభినందించారు. పార్టీ కార్యకర్తలకు గుర్తింపునివ్వాలని ప్రజాసేవలో వారిని భాగస్వామ్యుల్ని చేయాలని ఒక ప్రకటనలో కోరారు.