లాల్ గఢ్ లో మావోయిస్టులపై పోరు
పిరాకాట: పశ్చిమబెంగాల్లోని లాల్ గఢ్ ను మావోయిస్టుల నుంచి విముక్తి చేసేందుకు వామపక్ష ప్రభుత్వం పోరాటం ప్రారంభించింది. స్థానిక పోలీసు బలగాలకు సాయంగా ఐదు కంపెనీల బీఎస్ ఎఫ్ బలగాలు, ఎనిమిది కంపెనీల సీఆర్ పీఎఫ్ బలగాలను లాల్ గఢ్ ప్రాంతానికి తరలించారు. అవసరమైతే రంగంలోకి దించేందుకు 200 మంది కోబ్రా సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. పిరకట నుంచి లాల్ గఢ్ వరకూ ఉన్న 30 కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఐదు కి.మీ. వరకూ విజయవంతంగా ముందుకు దూసుకెళ్లాయి. ప్రాణనష్టం లేకుండా చూడాలని వారిని ఆదేశించారు. తొలుత పిరకటలో గురువారం పోరు మొదలైంది. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి 600 మంది ఆదివాసీలను చెదరగొట్టారు. గొడ్డళ్లు, కర్రలు, విల్లంబులు ధరించిన గిరిజనులు వారిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఒక్కో ఇంటిని సోదా చేస్తూ పోలీసులు ముందుకు కదులుతున్నారు. మందుపాతరల భయం కూడా వారిని వెన్నాడుతోంది. చీకటి పడటంతో తనిఖీలకు తాత్కాలికంగా విరామం కల్పించారు.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావటంతో రాత్రివేళ అడవిని దాటేందుకు సాహసించలేదు. లాల్ గఢ్ కి వెళ్లే దారిలో పలు చోట్ల గిరిజనులు చెట్లను నరికి రహదారికి అడ్డంగా పడేశారు. మహిళలు, చిన్నారులు ముందు వరుసలో వలయంగా ఏర్పడి పోలీసులను ప్రతిఘటిస్తున్నారు. 'లాల్గఢ్లో పోలీసుల ఆపరేషన్ మొదలైంది. దీన్ని పూర్తి చేసేందుకు ఎలాంటి కాలపరిమితి నిర్ణయించలేదు.కేంద్ర బలగాలు మాకు సహకరిస్తున్నాయి. రక్తపాతాన్ని వీలైనంతగా నివారించాలనేది మా లక్ష్యం. దశలవారీగా దీన్ని పూర్తి చేస్తాం. లాల్గఢ్ ప్రాంతంలోని 18 పోలీసు స్టేషన్లను విడిపిస్తాం. మందు పాతరలకు కూడా మేం సిద్ధం కావాల్సి ఉంది' అని పశ్చిమ బెంగాల్ డీజీపీ సుజిత్కుమార్ సర్కార్ కోల్కతాలో ప్రకటించారు. కోబ్రా బలగాలను తక్షణం రంగంలోకి దించేది లేనిదీ ఆయన వెల్లడించలేదు. గిరిజనుల సమస్యపై ప్రధానితో ముఖ్యమంత్రి బుద్ధదేవ్ చర్చించే అవకాశం ఉందని తెలిపారు.
అమ్తాలా, చంద్రపూర్, బిన్పూర్, బసంత్పూర్, ఫుల్బరియా, మెల్గా తదితర అటవీ సమీప గ్రామాల్లో గిరిజనులు విల్లు, బాణాలతో పోరుకు సిద్ధమయ్యారు. నిఘా వర్గాల అంచనా ప్రకారం లాల్గఢ్లో 500 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 200 మంది గెరిల్లా పోరాటంలో సుశిక్షితులు. నందిగ్రామ్ తాలూకు చేదు అనుభవంతో ఇక్కడ దూకుడుగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తోంది. 50 గ్రామాలకు స్వేచ్ఛ కల్పించినట్లు ప్రకటించిన మావోయిస్టులు మరిన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య బుధవారం లెఫ్ట్ ఫ్రంట్ సమావేశంలో పేర్కొన్నారు.
'మావోయిస్టులను లాల్గఢ్ ప్రాంతానికి పరిమితం చేసి వారి సహనాన్ని పరీక్షించాలి. వెంటనే చర్యలు మొదలు పెట్టవద్దు. ఓపిక నశించి వారే తొలుత దాడికి దిగుతారు. పోలీసులు, సీఆర్ పీఎఫ్ ఎదురుదాడి ప్రారంభిస్తారు' అని బుద్ధదేవ్ సూచించినట్లు సమాచారం. గిరిజనులను మావోయిస్టులు రక్షణ కవచాలుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రవాదుల నుంచి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. 'సాధారణ పౌరులను ముందు వరుసలో ఉంచి మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారు. మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకోకుండా తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించాల్సిందిగా గిరిజనులకు విజ్ఞప్తి చేస్తున్నాం' అని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం పేర్కొంది. బెంగాలీ, సంతళీ భాషల్లో రూపొందించిన ఈ కరపత్రాలను లాల్గఢ్లో శుక్రవారం హెలికాప్టర్ల ద్వారా జారవిడవనున్నారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications