Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్ష కోట్లు దాటిన బడ్జెట్‌

హైదరాబాద్‌: ఆర్థిక మాంద్య దుష్ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచినట్లు ఆర్థిక మంత్రి రోశయ్య శుక్ర వారం శాసనసభలో ప్రకటించారు. 2009-10 సంవత్సరానికి మరోసారి లక్ష కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించిన రోశయ్య, ప్రజాకర్షక పథకాలకు భారీగా నిధులు కేటాయించి సంక్షేమం గురించి మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగరాభివృద్ధికి కేటాయింపులు అనూహ్య రీతిలో పెంచేశారు. హైదరాబాద్‌ నగరానికి గోదావరి జలాల తరలింపునకు నిధులు కేటాయించారు. అదేవిధంగా విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. వ్యవసాయ రంగం, ఆరోగ్య శ్రీ పథకానికీ కేటాయింపులు పెరిగాయి. కేంద్ర సాయం లభిస్తుందన్న భరోసాతో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులను కొంతమేర తగ్గించారు.

ఓ పక్క ఆర్థిక మాంద్య విపత్కర పరిస్థితులు, మరోపక్క గ్రేటర్‌ ఎన్నికలను బ్యాలెన్స్‌ చేస్తూ ఆర్థిక మంత్రి రోశయ్య అసెంబ్లీలో 2009-10 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.1,03,485.33 కోట్ల బడ్జెట్‌లో ప్రజాకర్షక సబ్సిడీ పథకాలు, సంక్షేమం, మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. అయితే ప్రతిపాదిత కేటాయింపుల్లో ప్రణాళికేతర వ్యయం ఎన్నడూ లేనివిధంగా రూ. 63,301.22 కోట్లకు చేరడం విస్మయం కలిగించే అంశం. ప్రతిపాదిత బడ్జెట్‌లో మిగిలిన రూ.40,184.11 కోట్లు ప్రణాళిక పద్దుల్లో చూపారు. నూతన ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాను 3.69 శాతంతో 16,162 కోట్లుగా అంచనా వేశారు. అదేవిధంగా రెవెన్యూ మిగులును రూ.2,406గా పద్దుల్లో చూపారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రేషన్‌ కోటాను నాలుగు కిలోల నుంచి ఆరు కిలోలకు పెంచడం, రైతులకు ఉచిత విద్యుత్‌ను ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు పెంచడంతో పాటు చేనేత కార్మికులకు రూ.312 కోట్ల రుణమాఫీ ప్రకటించారు.

అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాగునీటి రంగం, ఇందిరమ్మ గృహాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు కొంతమేర తగ్గిపోయాయి. సాగునీటి ప్రాజెక్టులకు రూ.17,800 కోట్లు కేటాయించగా, గృహ నిర్మాణాలకు రూ.1800 కోట్లను కేటాయించారు. కేంద్రం నుంచి సాగునీటి ప్రాజెక్టులకు ఇతోదిక సాయం అందవచ్చన్న ఆలోచనతో పాటు కేంద్ర పథకం ఇందిరా ఆవాస్‌యోజన కింద రాష్ట్రానికి లబ్ది చేకూరుస్తామన్న కేంద్ర ప్రభుత్వం హామీతో ఇందిరమ్మ ఇళ్ళకు కేటాయింపులు తగ్గించినట్లు రోశయ్య వివరించారు. అదీగాక గత బడ్జెట్‌లో పూర్తికాని ఇళ్ళ నిర్మాణానికి నిధులు కేటాయించిన పనులు ఇంకా జరుగుతోందని వివరించారు. ఇక విద్య, ఆరోగ్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు అనువుగానే ప్రణాళికేతర వ్యయాన్ని పెంచినట్లు రోశయ్య వివరించారు. అవసరాలకు అనుగుణంగా సంక్షేమ రంగాన్ని పటిష్టం చేయడం, మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు రోశయ్య చెప్పారు. అదేవిధంగా విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాన్ని 12 శాతంగా నిర్దేశించుకున్నామని, గోదావరి బేసిన్‌లో గ్యాస్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ప్రైవేటు భాగస్వామ్యంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అభివృద్ధి చేస్తామని, కడప, వరంగల్‌లో కొత్త విమానాశ్రయాలను నెలకొల్పుతామనీ ప్రకటించారు. కేవలం 30 నిమిషాల్లో బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించిన రోశయ్య మౌలిక వసతులు, సంక్షేమమే ప్రభుత్వం సంకల్పిస్తున్న లక్ష్యంగా పేర్కొన్నారు. ఇందుకే ప్రణాళికేతర వ్యయాన్ని పెంచామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+