దీపావళి తర్వాత ఢిల్లీకి రోశయ్య
జగన్ వర్గం వ్యవహారశైలిపై కూడా ఆయన అధిష్టానానికి వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అధికార యంత్రాంగంలో ఇప్పటికే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టిన రోశయ్య తనదైన పాలనను సజావుగా అందించడానికి అవసరమైన మంత్రులు ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. కె. జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వంటి సీనియర్లకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. జగన్ కు అనుకూలంగా, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొండా సురేఖ వంటివారిని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కూడా ఆయన మానసికంగా సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే జెసి దివాకర్ రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్లు రోశయ్యకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నారు. జగన్ వర్గం తమ రాజకీయాలను ఉధృతం చేసిన నేపథ్యంలో కాంగ్రెసు సీనియర్లు బుధవారం జెసి దివాకర్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. జగన్ వర్గాన్ని అడ్డుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వారు సమావేశమైనట్లు భావిస్తున్నారు.