తిరుగుబాటుకు జగన్ ప్లాన్?
జగన్ కడప నుంచి హైదరాబాదు రాగానే కాంగ్రెసులో రాజకీయ సందడి పెరిగింది. ముఖ్యమంత్రిగా రోశయ్య విఫలమయ్యారని చూపించడానికి కూడా జగన్ వర్గీయులు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. శాసనసభ్యులతో పాటు కొంత మంది మంత్రులు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేసే విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొండా సురేఖ ఒక్కరే బయటపడుతున్నప్పటికీ సమయం వచ్చినప్పుడు మరింత మంది ముందుకు వచ్చే ఆవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి.
వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శాసనసభ్యురాలు జయసుధ చేసిన ప్రకటనపై విరుచుకుపడిన సీనియర్ శాసనసభ్యుడు పి.శంకరరావుపై యువ శాసనసభ్యులు కొంత మంది తీవ్రంగా మండిపడ్డారు. శంకరరావుకు సవాళ్లు విసిరారు. అయితే పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటుకు పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక జరిగే వరకు ఆగుతారా, అంతకు ముందుగానే అందుకు పూనుకుంటారా అనేది తెలియడం లేదు. మూడు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల తర్వాత జగన్ వర్గీయులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే అవకాశాలున్నాయని భావిస్తున్నప్పటికీ కొంత సమయం తీసుకోవచ్చునని అంటున్నారు. ఏదో సమయంలో సిఎల్పీ సమావేశమో, శాసనసభ సమావేశాలో పెట్టక తప్పదు కాబట్టి ఆమె సమయంలోనే తమ సత్తా చాటడానికి వ్యూహరచన చేసుకున్నారా అనేది కూడా స్పష్టం తెలియడం లేదు.