నిరాశతో నేడు బెంగళూరుకు వైయస్ జగన్
జగన్ కు ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర ప్రజల మనోభావాలు, పార్టీ ఎమ్మెల్యేల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందని పలువురు శాసనసభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. వారంలోగా అధిష్ఠానం నుంచి జగన్ కు పిలుపు వస్తుందని చెప్పారు. రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, దానం నాగేందర్, బాలినేని శ్రీనివాసరెడ్డి, విశ్వరూప్, శిల్పా మోహన్రెడ్డి, పార్థసారధి సహా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు గురువారం జగన్ను కలిశారు.
జగన్ను కలిసిన అనంతరం రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ...సీనియర్ల పేరుతో కొందరు నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ ఆ గ్రూపుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ లేరని అన్నారు. రాష్ట్రంలో వాస్తవ సమాచారం పొందేందుకే ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్ఛార్జిని కేంద్రం మార్చిందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్రావు అన్నారు.
సీఎం అధికారిక నివాసంలో జగన్ను కలిసిన వారిలో... ఎంపీలు పొన్నం ప్రభాకర్, ఉండవల్లి అరుణ్కుమార్, ప్రభుత్వ విప్ కొండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యేలు ఎం.నీలకంఠం, జోగిరమేష్, రాజయ్య, డి.చంద్రశేఖరరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, వెంకట్రామిరెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఎం.సుచరిత, పొన్నాడ వెంకట సతీష్కుమార్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్రెడ్డి, మాజీ మంత్రులు జూపూడి రత్నాకర్రావు, వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ కేవీపీ సాయంత్రం ప్రత్యేకంగా జగన్ను కలిసి మాట్లాడారు.