హై కమాండ్ ఉచ్చులో వైయస్ జగన్

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా చేయడం వల్ల, ఆమె రాజీనామాకు చెప్పిన కారణం వల్ల జగన్ కు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందనేది స్పష్టంగానే తెలిసిపోతోంది. ఈ విషయాన్నే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ గౌడ్, వి. హనుమంతరావు వంటి వారు చెబుతున్నారు. ఈ మాటలను అప్పటికప్పుడు వారంటున్నారని చెప్పడానికి కూడూ వీలు లేదు. అధిష్టానం ప్రమేయం లేకుండా వీరు ఆ ప్రకటనలు చేస్తారని కూడా అనుకోవడానికి లేదు. వారి ప్రకటనలను బట్టే అధిష్టానం మనోగతమేమిటో అర్థమవుతోంది. ఒక రకంగా జగన్ వారి ప్రకటనల ద్వారా అధిష్టానం సంకేతాలు ఇస్తోందని అనుకోవాల్సి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే రాజకీయ పరిపక్వత జగన్ కు ఉన్నట్లు అనిపించడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోవడానికే ఆయన సిద్ధపడుతున్నట్లు ఆయన అనుయాయుల చర్యలుంటున్నాయి.
ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు వంటి వారి ప్రకటనలు కూడా జగన్ కు మేలే చేసే విధంగా లేవు. కొండా సురేఖ చర్యను ఆయన ప్రశంసిస్తున్నారు. ఆమె దారిలోనే మరో నలుగురు మంత్రులు నడుస్తారని ఆయన అంటున్నారు. నిజానికి, సోనియానో, తమనో గుర్తించనంతగా రాజకీయాలు నెరుపుతూ వచ్చిన కొండా సురేఖ లాంటి వారిని మంత్రివర్గం నుంచి తొలగించడమే పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ రాజీనామా చేయాల్సిన అగత్యంలో పడింది. కొండా సురేఖ రాజీనామా విషయంలో జగన్ ప్రమేయం లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చేసిన ప్రకటన తనకు అనుకూలమైంది కాదనే విషయాన్ని జగన్ గుర్తించే స్థితిలో లేరు. జగన్ పట్ల తాము సానుకూలంగానే ఉన్నామని చెబుతూనే తమ పని తాము చేసుకుపోయే ఎత్తుగడను పార్టీ అధిష్టానం అనుసరిస్తోంది. జరుగుతున్న పరిణామాల్లో జగన్ ప్రమేయం లేదని నమ్మేంత అమాయకంగా పార్టీ అధిష్టానం లేదు. సాక్షి టీవీ వార్తాకథనాల తీరును చూస్తే కచ్చితంగా జగన్ తన ప్రయత్నాలను విరమించుకుని, సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఒక వేళ నిజంగానే జగన్ అదే అనుకుంటున్నప్పటికీ ఆ వార్తాకథనాలు, ఇంటర్వ్యూలు అందుకు ఉపయోగపడే విధంగా లేవు. కొండా సురేఖ రాజీనామా వ్యవహారంలో సాక్షి కథనం గానీ, జగన్ పై ప్రకటనలు చేసిన మధుయాష్కీ, వి. హనుమంతరావు వంటి నేతలపై ఎమ్మెల్సీలు పుష్పలీల, జూపూడి ప్రభాకర రావు వంటి వారి ప్రకటనలకు సాక్షిలో ఇస్తున్న ఇంటర్వ్యూలు గానీ జగన్ ను నమ్మడానికి వీలు లేదనే సంకేతాలను అధిష్టానానికి అందిస్తున్నాయి.
పార్టీ అధిష్టానంలో తలలు పండిన నేతలున్నారు. డక్కాముక్కీలు తిన్నవారున్నారు. వారు చేష్టలకు, మాటలకు అర్థాలు చెప్పడం కష్టం కూడా. పైకి చెప్పేంత సున్నితంగా, మెతకగా వారి చర్యలుండవు. తొలుత గమనించాల్సిందేమిటంటే విధేయత ప్రకటించినా అది చేతల్లో కానరాకపోతే కాంగ్రెసు అధిష్టానం సహించదు. జగన్ రాజకీయ వ్యూహానికి సంబంధించిన ప్రారంభాలే మొదటి మోసం తెచ్చాయి. ఎంత చేసినా, ఏం చెప్పినా లాభం లేదు. కొంత కాలం మౌనంగా ఉండడం తప్ప జగన్ కు మరో మార్గం లేదు. ఆయన మౌనంగా ఉండడమంటే తన వర్గాన్ని మౌనం చేయడం కూడా.












Click it and Unblock the Notifications