సురేఖకు మరో ఎదురు దెబ్బ, డిఐజిగా శ్రీనివాసరెడ్డి
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రమాకాంత్రెడ్డి నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. 1994 బ్యాచ్కు చెందిన కె.శ్రీనివాసరెడ్డి 2004, జూన్ 21న వరంగల్ జిల్లా ఎస్పీగా నియమితులైన ఆయన అదే సంవత్సరం డిసెంబర్ 29న మహబూబ్నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. సుమారు ఆరు మాసాలపాటు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాస రెడ్డి పోలీసులు, ప్రజలు, ప్రజాప్రతినిధులకు 'పోలీసింగ్'ను చూపించి అనతికాలం లోనే అందరి ప్రశంసలు అందుకున్నారు.
అసాంఘిక శక్తులకు సింహస్వప్నం 'కొత్తకోట'.....జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే శ్రీనివాసరెడ్డి అసాంఘిక శక్తులకు సింహస్వప్నంగా మారారు. ల్యాండ్ మాఫియా, రౌడీయిజంపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. స్కిల్గేమ్ పేరిట వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడటానికి కారణమైన పేకాట క్లబ్(అనుమతి లేని వాటిని)లను మూసి వేశారు. పేకాట క్లబ్లను మూసి వేయడంతోపాటు నిబంధనల మేరకు బ్రాందీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు నడిచేలా చర్యలు తీసుకున్నారు. నెలసరి మామూళ్ల వ్యవస్థను రూపుమాపిన శ్రీనివాస్రెడ్డి పోలీస్ శాఖలో అవినీతికి చరమగీతం పాడారు.
ప్రభుత్వం, మావోయిస్టులకు మధ్య శాంతి చర్చల సమయంలో ఎస్పీగా వ్యవహరించిన ఆయన సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. మావోయిస్టు నేత డీవీకె. స్వామి అలియాస్ యాదన్నపై దళసభ్యుడు లకణ్ కాల్పుల జరిపిన 'కోవర్టు' ఆపరేషన్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో పరకాల-చిట్యాల మండలాల సరిహద్దు నాగుర్లపల్లి శివారులో జరిగిన ఎన్కౌంటర్ లో రాజిరెడ్డి అనే నక్సలైట్తో పాటు మరో ఇద్దరు మృతిచెందారు. చర్చల సమయంలో పోలీసులు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ప్రజాసంఘాలు రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఆరు మాసాల కాలంలో జిల్లా ఎస్పీగా అనేక సంచనాలు సృష్టించిన కొత్తకోట శ్రీనివాస్రెడ్డి వరంగల్ డీఐజీగా నియమితులు కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది.