చిదంబర సమావేశం: పార్టీలకు తలనొప్పులు
కాగా, తెలుగుదేశం పార్టీ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ గండం దాటడం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కష్టంగానే ఉంది. అయితే సమావేశాన్ని బహిష్కరించడానికి ఆయన కారణాలు వెతుకుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం ఇరు ప్రాంతాల నాయకులు విడివిడిగా సమావేశమయ్యారు. తమ అభిప్రాయాలను చంద్రబాబుకు వివరించారు. కాగా, చిదంబరం సమావేశాన్ని తప్పు పట్టేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే తాము ఢిల్లీకి వెళ్లలేనంత దద్దమ్మలం, పిరికి వాళ్లం కాదని ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకుడు తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు జిల్లాలవారీగా, ప్రాంతాలవారీగా పార్టీ నాయకులతో సమావేశమవుతున్నారు. కోస్తాంధ్ర తెలుగుదేశం నాయకులు కాంగ్రెసుపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేయడంలో మునిగిపోయారు.
ముఖ్యమంత్రిగా సమావేశానికి పార్టీలతో ప్రమేయం లేకుండా రోశయ్యకు ఆహ్వానం అందింది. ఈ స్థితిలో రోశయ్య తనకు అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. ఆయన ఏ వాణి వినిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కె. చంద్రశేఖరరావు, జయశంకర్ హాజరు కానున్నారు. సిపిఐ తరఫున పార్టీ రాష్ట కార్యదర్శి కె. నారాయణ, శాసనసభ్యుడు గుండా మల్లేష్ హాజరవుతారు. సిపిఐ తరఫున బివి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రజారాజ్యం సమైక్యవాదానికి కట్టుబడి పోవడంతో సమస్యలేకుండా పోయింది. ఈ పార్టీ తరఫున చిరంజీవి, కోటగిరి విద్యాధర రావు హాజరయ్యే అవకాశం ఉంది.