తెలంగాణపై భేటీ: సర్వత్రా ఉత్కంఠ
హోం మంత్రిత్వ శాఖ సమావేశం మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుంది. అభిప్రాయ సేకరణ జరిపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విధివిధానాలను ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఏకాభిప్రాయ సాధన కోసం విస్తృత స్థాయి చర్చల్లో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిదంబరం ఇప్పటికే చెప్పారు. రాష్టానికి చెందిన రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ప్రాంతాలవారీగా విడిపోయి తెలంగాణ అనుకూల, వ్యతిరేక విధానాలను వ్యక్తీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభిప్రాయాల కన్నా ప్రాంతాలవారీగా రాజకీయ నాయకుల అభిప్రాయం ముఖ్యంగా మారిపోయింది.
కాగా, రాష్ట్రంలో ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు ప్రాంతాల ఆందోళనకారులు తమ తమ వైఖరులను కేంద్రానికి తెలియజేయడానికి రైళ్ల రాకపోకలను అడ్డుకుంటున్నారు. పలు రైళ్లను రాష్ట్రంలో నిలిపేశారు.