టీవీ5 జర్నలిస్టులు రెండు వారాలపాటు జైల్లోనే
వైఎస్ మృతిపై వివాదాస్పద కథనాలను ప్రసారం చేసిన కేసులో టీవీ-5 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బ్రహ్మానందరెడ్డి, ఇన్పుట్ ఎడిటర్ వెంకటకృష్ణలకు న్యాయస్థానం ఈ నెల 22 వరకూ రిమాండు విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. శుక్రవారం రాత్రి వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం రాత్రి వరకూ మసాబ్ ట్యాంక్లోని సీఐడీ కార్యాలయంలో విచారించారు. రాత్రి 8.30 గంటలకు సికింద్రాబాద్ నాలుగో అదనపు ఛీఫ్ మెట్రోపాలిటెన్ మేజిస్ట్రేట్ వి.వి.శేషుబాబు ముందు హాజరుపరిచారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో శనివారం రాత్రి ప్రత్యేకంగా కోర్టును తెరిపించారు.
వీరిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 153-ఎ, 505(2), కేబుల్టీవీ నెట్వర్క్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 16 కింద కేసులు నమోదు చేయగా... అవి ఇక్కడ వర్తించవని న్యాయమూర్తి చెప్పారు. ఆయన సూచనమేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ను సవరించి ఐపీసీ 505(1) -హింసను ప్రేరేపించడం- కింద వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరికీ ఈనెల 22 వరకూ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వీరి బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్పై విచారణను 11వ తేదీకి వాయిదా వేశారు. బ్రహ్మానందరెడ్డి రెండు కాళ్ళకు పక్షవాతం లక్షణాలు ఉన్నాయని ఆయనతరపు న్యాయవాది చేసుకున్న విజ్ఞప్తి మేరకు సరైన చికిత్స అదించాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అప్పటికే పొద్దుపోవడంతో వారిని మళ్ళీ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం జైలుకు తరలించనున్నారు.