రేపు తెలంగాణ వైద్య గర్జన: హైకోర్టు అనుమతి
పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని సభలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ వైద్య ఫోరం ప్రతినిధులు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఫోరం కన్వీనర్ డాక్టర్ బాబురావు, విద్యార్థి ప్రతినిధి డాక్టర్ రుక్మారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ వైద్య గర్జనలో పాల్గొనేందుకు వైద్య విద్యార్థులు, పారా మెడికల్ సిబ్బంది వారివారి గుర్తింపు కార్డులను తీసుకొని రావల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరూ వైద్య గర్జనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్న తెలంగాణ వైద్య గర్జనకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అదనపు బలగాలను రప్పించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నట్లు సుల్తాన్బజార్ ఏసీపీ నారాయణ తెలిపారు.