మేడారంలో మినీ జాతరగా తిరుగువారం

మేడారంలో సమ్మక్క తిరుగువారం పండగ మినీ జాతరను తలపించింది. సమ్మక్క-సారలమ్మల వనప్రవేశం జరిగిన నాలుగు రోజులకు మేడారంలో గిరిజనులు సమ్మక్క తిరుగువారం పండగను పూజారులు కొక్కెర సాంబశివరావు, కాక సారయ్య ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. దీంతో మేడారం జాతర పూర్తయినట్లు గిరిజనులు భావిస్తారు. ఈ సందర్భంగా మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తిరుగువారం పండగ జరుగుతుందనే విషయం తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గద్దెల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో సందడి కనిపించింది. సుమారు 40వేల మంది భక్తులు వనదేవతలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్నారు. తొలుత గిరిజన పెద్దలు, పూజారులు సమ్మక్క, సారలమ్మ ఆలయాలను నీటితో శుభ్రం చేసి ఆలయం చుట్టూ రంగురంగుల ముగ్గులు వేశారు.
ఉదయం 10 గంటలకు డోలువాయిద్యాలతో సమ్మక్క, సారలమ్మ ఆలయాలకు పూజారులు చేరుకుని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గుడి ఇప్పడం, మెలగడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సమ్మక్క గుడిలో సాయంత్రం వరకు పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పూజారులు, గిరిజన పెద్దలు వస్త్రాలు, పూజా సామగ్రి తీసుకుని చిలకలగుట్టకు చేరుకున్నారు. దేవతకు నిర్వహించే కార్యక్రమాలను ఎవరి కంట పడకుండా పూజారులు రహస్యంగా జరపడం ఇక్కడి ప్రత్యేకత. రెండేళ్లకోమారు జరిగే జాత ర వరకు మమ్మల్ని సల్లంగా సూడు తల్లీ అని వేడుకున్నారు. ప్రతీ బుధవారం నీ పండగకు పూజలు చేస్తామని గిరిజన పెద్దలు, పూజారులు దేవతను వేడుకొని మేడారానికి తిరిగొస్తారని గిరిజన పెద్దలు తెలిపారు.












Click it and Unblock the Notifications