చంద్రబాబుకు కెవిపి బహిరంగ లేఖ

తాను చంద్రబాబు ఒకసారే 1978లో హైదరాబాద్ వచ్చామని, అప్పుడు చంద్రబాబు ఆస్తులేమిటో తన ఆస్తులేమిటో తెలుసుకోవాలని ఆయన అన్నారు. తాను గుల్బర్గా వైద్య కశాశాలకు కట్టిన డొనేషన్ మొత్తం కన్నా చంద్రబాబు కుటుంబం ఆస్తి ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోని సంపన్నుల్లో ఒక్కరిగా చంద్రబాబు మారారని ఆయన అన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్ ను చితక కొట్టినట్లుగా అందరినీ చితకగొట్టగలమని చంద్రబాబు అనుకుంటే అది తప్పు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తన స్వార్థ రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. పురంధేశ్వరిపై బాలకృష్ణను, సవతి తల్లి లక్ష్మీపార్వతిపై హరికృష్ణను ఉసిగొల్పిన చరిత్ర చంద్రబాబుదని ఆయన అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలపై తాను అగ్నిపరీక్షకైనా సిద్ధమని ఆయన చెప్పారు. దుబాయ్ లో తనపై, తన కుమారుడిపై కేసులున్నట్లు, తాము పారిపోయి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, అదే నిజమైతే తమ కుటుంబసభ్యులమంతా ఈ నెల 11వ తేదీ దుబాయ్ వెళ్తున్నామని, ఐదు రోజుల పాటు ఉంటామని, ఈలోగా చంద్రబాబు ఏమైనా చేయగలిగితే చేయాలని ఆయన అన్నారు. దుబాయ్ లో తనపై కేసు విచారణ జరిగితే జైలుకు వెళ్తానని, బెయిల్ కూడా తీసుకోనని, నిజంగా తాను అవినీతి పాల్పడినట్లు రుజువైతే అక్కడి నుంచి తిరిగి రానని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు వైయస్ జగన్ పై చంద్రబాబు అసంబద్ధమైన ఆరోపణలు చేశారని, ఎంతగా గగ్గోలు పెట్టిన ప్రజలు నమ్మలేదని, చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను తాను లాగదలుచుకోలేదని, తమ పిల్లలను కూడా లాగే చంద్రబాబుకు జాతి నీతి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications