బెంగాల్: మావోయిస్టుల దాడిలో 24 మంది జవాన్ల మృతి
పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బీణ్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సీల్దా జవాన్ల క్యాంపుపై మావోయిస్టులు విరుచుకుపడి 24 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఈశాన్య సరిహద్దు రైఫిల్స్ దళానికి చెందిన ఈ జవాన్లలో కొందరు అగ్నికి ఆహుతయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో జవాన్లు భోజనాల తయారీకి ఉపక్రమించిన సమయంలో మెరుపుదాడి జరిగింది. ఆదమరిచి వంటపనుల్లో నిమగ్నమైన జవాన్లపై గుళ్ల వర్షం కురిసింది.
అనంతరం మందుపాతర పేలుడుతో భారీ విస్ఫోటం సంభవించింది. కొందరు జవాన్లు మంటల్లో కాలిపోయారు.కొద్దిసేపటికి తేరుకున్న మిగతా జవాన్లు ఎదురుదాడికి దిగారు. సుమారు 45 నిముషాలపాటు భీకరపోరు కొనసాగింది. సంఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించినట్లు సమాచారం. చీకటి పడటం, మందుపాతర్ల భయం కారణంగా నక్సల్స్ కోసం చేపట్టిన గాలింపులకు అంతరాయం కలిగింది. దాడి సమయంలో క్యాంప్లో సుమారు 51 మంది జవాన్లున్నారు. మోటార్సైకిళ్లపై వచ్చిన వందమందికి పైగా మావోయిస్టులు దాడిలో పాల్గొన్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఎన్ఎస్ నిగమ్ పేర్కొన్నారు.
ఈ సంఘటనకు తామే బాధ్యులమని మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ ప్రకటించారు. హోంమంత్రి చిదంబరం ప్రకటించిన 'ఆపరేషన్ గ్రీన్హంట్'కు ఇదే తమ సమాధానమన్నారు. సైనిక బలగాలను ఉపసంహరించుకోకుంటే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు లాల్గఢ్ సమీపంలోని ధరంపూర్ జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంప్పై కూడా రాత్రి 9 గంటల సమయంలో మావోయిస్టులు దాడి చేశారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి.