9న రాజీనామా: టిడిపి ఎమ్మెల్యే మైనంపల్లి
తెలంగాణ కోసం మెదక్ జిల్లాలో ప్రాణత్యాగం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యుడ్ని తన స్థానంలో నిలబెట్టి గెలిపిస్తానని ఆయన చెప్పారు. తెలుగుదేశం మెదక్ జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ కమిటీని ప్రకటించిన కొద్దిసేపటికే మైనంపల్లి తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. చంద్రబాబు కాళ్లు పట్టుకునైనా సరే మెదక్ జిల్లాలోని మూడు స్థానాల్లో అమర వీరుల కుటుంబాలకు చెందినవారిని నిలబెట్టి గెలిపించుకుంటానని ఆయన అన్నారు. వీటిలో రెండు తెరాస రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాలున్నాయి.
తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని ఆయన అన్నారు. ప్రాణాలున్నంత వరకు తాను తెలుగుదేశంలోనే ఉంటానని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పుట్టింది కాబట్టి మెదక్ జిల్లాలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబ సభ్యులను ఖాళీ అయిన స్థానాల్లో నిలబెట్టి గెలిపించుకోవాలని ఆయన అన్నారు.