చంద్రబాబును నిలిపేసిన తెలంగాణ వాదులు
హైదరాబాద్కు పూర్వవైభవం తీసుకురావలసిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న టిడిపి నేతలు సింగరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, దినేష్ కుమార్లను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో హైదరాబాద్ని అన్నివిధాల అభివృద్ధిపరిచామని చెప్పారు. తీగల కృష్ణారెడ్డి మేయర్గా ఉన్న సమయంలో నగరమంతా పచ్చగా, క్లీన్ అండ్ గ్రీన్లో మొదటి స్థానంలో ఉండేదని తెలిపారు.
ఇప్పుడా పరిస్థితి లేదని, అంతా అధ్వాన్నం చేశారన్నారు. మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలన్నారు. జైళ్లలో సంస్కరణలకు కూడా తెలుగుదేశం పార్టీ అనేక చర్యలు తీసుకుందన్నారు. క్షణికమైన ఉద్రేకంలో తప్పు చేసినవారిలో పరివర్తన తీసుకురావాలన్నది తమ ఉద్దేశం అన్నారు. సంస్కరణలో భాగంగా ముషీరాబాద్లో ఉన్న జైలుని ఇక్కడికి తీసుకువచ్చామని చెప్పారు.