హైదరాబాద్ లో లష్కరే ఉగ్రవాది అరెస్టు
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్కి చెందిన జియా ఉల్హక్ ప్రస్తుతం హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈద్ బజార్ లో ఉంటున్నాడు. హక్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ లష్కరే తోయిబా కమాండర్ అబ్దుల్ అజీజ్ అలియాస్ అబు రెహాన్ తో పరిచయం ఏర్పడటంతో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడై 2002లో పాకిస్తాన్ వెళ్లాడు. కరాచీ నుంచి ముజఫరాబాద్ చేరిన హక్ ను అబు ఖాసిం అనే వ్యక్తి లష్కరే శిక్షణ శిబిరానికి తీసుకెళ్లాడు. అక్కడ ఏకే47 పేల్చటం, పేలుడు సామాగ్రిని వినియోగించడం వంటి విధ్వంసక అంశాల్లో నెలరోజులపాటు కఠిన శిక్షణ పొందాడు.
అనంతరం పూంచ్ సెక్టార్ ద్వారా భారత్ లో అడుగుపెట్టాడు. అప్పటినుంచి నగరంలోనే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ క్రమంలో అబ్దుల్ అజీజ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు 2005 డిసెంబరులో ఢిల్లీ వెళ్లాడు. అక్కడ నుంచి పిస్తోలు, 4 గ్రెనేడ్లు తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. 2006 మే 7న ఓడియన్ థియేటర్లో 2 గ్రెనేడ్లు పేల్చాడు. అప్పటి నుంచి నిద్రాణంగా ఉన్న హక్ కు మళ్లీ లష్కరే నుంచి ఆదేశాలు రావడంతో మరోమారు భారీ విధ్వంసానికి సిద్ధమయ్యాడు. అయితే సకాలంలో అతడ్ని అరెస్టు చేయటంతో ప్రస్తుతానికి ముప్పు తప్పినట్లేనని కమిషనర్ అన్నారు.