కెసిఆర్ సంస్కారం నేర్చుకోవాలి: చిరు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సరిగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే దశాబ్దాల నుంచి పోలవరం ప్రాజెక్టు సాకారం కాలేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చేస్తున్న బస్సుయాత్ర రెండోరోజు కాకినాడ రూరల్, కాకినాడ నగరం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలో సాగింది. పోలవరం కోసం పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. గతంలో దేవాదుల కోసం చంద్రబాబు నాయుడు, ప్రాణహిత-చేవెళ్ల కోసం కేసీఆర్, జలయజ్ఞం కోసం వైయస్ రాజశేఖర రెడ్డి చేసింది రాజకీయమే అయితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం తాను చేస్తున్న ఉద్యమం కూడా రాజకీయమే అన్నారు. మేం ఉద్యమం చేపడితే అయిపోయిన పెళ్లికి చిరంజీవి బాజాలు వాయిస్తున్నారంటున్నారు. కానీ ఇంకా పెళ్లే అవ్వలేదు. పెళ్లిచూపులు మాత్రమే అయ్యాయి. ఒకవేళ అది పెటాకులైతే? అందుకే మేం ప్రజల పక్షాన పోలవరం ప్రాజెక్టు అనే లోకకల్యాణాన్ని జరిపించేందుకు ఉద్యమిస్తున్నాం.