చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెసుకు తోక అవుతుందా?
తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయబోమని చిరంజీవి చెబుతున్నారు. అయితే, విలీనం అంశం కూడా ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని విలీనం చేస్తే సముద్రం లాంటి కాంగ్రెసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుందని, దాని వల్ల అధికారం అందుతుందో అందదో చెప్పలేమని సన్నిహితులు చిరంజీవికి చెబుతున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షంగా ఉంటూ తగిన సీట్లు సంపాదించుకుని ఒత్తిడి రాజకీయాల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే ఆలోచన చిరంజీవి ఎజెండాలో ప్రధానాంశమై ఉండవచ్చు. అయితే, కాంగ్రెసుతో పొత్తుల వల్ల, స్నేహం వల్ల ప్రజారాజ్యం పార్టీ ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాంగ్రెసుకు ఎల్లకాలం తోక పార్టీగా మాత్రమే మిగిలిపోవాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెసులో విలీనం చేస్తే చిరంజీవి ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉంటుందని, సోనియా గాంధీ ఒక్కసారి హామీ ఇస్తే దాన్ని అమలు చేస్తారని, అందువల్ల కాంగ్రెసులో పార్టీని విలీనం చేసి ఆ పార్టీని అధికారాన్ని తిరిగి సొంత చేసుకోవడానికి ఇమేజ్ ద్వారా, కాంగ్రెసు క్యాడర్ ద్వారా ప్రయత్నిస్తేనే చిరంజీవి తొందరగా అధికార యోగం పడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.