తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబే చిరంజీవి టార్గెట్

అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం సీట్లు ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకోలేదని, ఇదేనా సామాజిక న్యాయమని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించాక జాతీయ స్థాయిలో సంకీర్ణ రాజకీయాలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని, 1996లో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన పార్టీలను ఒక గొడుగు కిందకు తెచ్చి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. బీజేపీని దూరంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారని, కీలకమంత్రి పదవులూ స్వీకరించారని, ఆ తర్వాత మళ్లీ బీజేపీ, కాంగ్రెస్లకు సమాన దూరం అని వామపక్షాలతో కలిసి పోటీ చేశారని ఆయన అన్నారు. 1999 ఎన్నికల్లో మళ్లీ వామపక్షాలను దూరంగా నెట్టి ఎవరినైతే మతతత్వ పార్టీ అన్నారో ఆ బీజేపీతోనే పొత్తు కుదుర్చుకున్నారు.
కమ్యూనిస్టులకు కాలం చెల్లిందన్న చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని మళ్లీ వామపక్షాలవైపు మొగ్గు చూపారని తిరిగి బీజేపీని మతతత్వ పార్టీ అని దూషించారు. 2009 వరకు విమర్శలు చేసిన టీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకున్నారని, ఎన్నికల ఫలితాలు సానుకూలంగా రాకపోవడంతో ఆ పార్టీని దూరంగా నెట్టేశారని, అవకాశవాద పొత్తుల్లో అందెవేసిన చెయ్యి చంద్రబాబుదని, అనుకూలంగా ఉంటే ఒక రకంగా లేకుంటే మరోరకంగా మాట్లాడుతారని ఆయన విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏం చేసినా తప్పు లేదు, ప్రశ్నించకూడదు, అనైతికం అనకూడదనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications