కెవిపి రామచంద్రరావు బినామీ కంపెనీకి పోలవరం పనులు: సోమిరెడ్డి
ఎనిమిది నెలల కిందట పోలవరం పనులకు సవరించిన అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. అయితే ఇందులో మొదటిసారిగా సాగునీటి శాఖకు చెందిన స్పిల్వే, రాక్ ఫిల్ డ్యామ్లతో పాటు జెన్కోకు సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టును కూడా కలిపి ఒకే టెండరు పిలవడం ప్రపంచంలోనే అతి పెద్ద వింత అని అన్నారు. పవర్హౌస్ పనికి టెండర్లు పిలిచి అమలు చేయించే అపారమైన అనుభవం, మౌలిక సౌకర్యాలు జెన్కోకు ఉన్నా, జెన్ కోను విస్మరించారన్నారు. విద్యుత్ ప్రాజెక్టును...జలయజ్ఞంలో భాగంగా జరిగే సాగునీటి పనుల్లో కలిపేశారన్నారు. ఇలా కలిపేసి ఈ రెండు రంగాల్లో అనుభవం ఉన్న ఏకైక కంపెనీకి పనులను ఇచ్చేశారని, కేవీపీ బినామీ కంపెనీ కోసమే ఇలా చేశారని సోమిరెడ్డి తెలిపారు.
విదేశీ కంపెనీతో భాగస్వామ్యం ఉండొద్దంటూ మరొక నిబంధన కూడా పెట్టారని, ఇతర కంపెనీలను టెండరు ప్రక్రియ నుంచి దూరంగా ఉంచేందుకేనని చెప్పారు. ఇటీవల జాతీయ రహదారుల సంస్థ టెండర్లలో తలెత్తిన వివాదంలో ఒక అధికారిని, ఒక కాంట్రాక్టరును జైలుకు పంపారని గుర్తు చేశారు. పోలవరం టెండర్ల విషయంలో సీబీఐ, ఇతర కేంద్ర నిఘా సంస్థలు ఎందుకు మౌనం వహిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి నిబంధనలతో ఖరారు చేసిన టెండర్ల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యే పరిస్థితి కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.