కెసిఆర్ కు షాక్: సీమాంధ్ర నేతలతో కాంగ్రెసు ప్లాన్
తెలంగాణ నినాదంతో కాంగ్రెసు నాయకత్వం ఉప ఎన్నికల్లో బరిలోకి దిగనుంది. ఇందుకు సీమాంధ్ర నాయకులను కాంగ్రెసు నాయకత్వం ఒప్పించింది. సీమాంధ్ర నాయకులకు కూడా కెసిఆర్ దెబ్బ తినడమే కావాలి. కెసిఆర్ దెబ్బ తింటే తెలంగాణ నినాదం ఉండదనే ఆలోచనతో ఉన్నారు. దీంతో శుక్రవారంనాడు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పిన వెంటనే తెలంగాణ నినాదానికి అనుకూలంగా సీమాంధ్ర నేతలు గొంతు కలిపారు.
తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తమ పార్టీయేనని కాంగ్రెసు తెలంగాణలోని ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడింది. కెసిఆర్ తప్పుడు ఎత్తుగడల వల్ల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగిందని కాంగ్రెసు ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి దిగబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసిందని విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఈ ఉప ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెసు సీమాంధ్ర నేతలు మౌనం వహించే విధంగా కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంది.