పోలవరంపై కాంగ్రెసు: టోకరా చిరంజీవి మండిపాటు
పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెసు సీనియర్లు మెలిక పెట్టడం, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై అవినీతి ఆరోపణలు చేయడం వంటి సంఘటనలతో అసలు ప్రాజెక్టు నిర్మాణమే సందేహంలో పడినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు అక్రమాల ఆరోపణలపై ఆమె దర్యాప్తునకు కూడా ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టుకు ఎసరు పెట్టేందుకే ఈ వ్యవహారాన్ని కాంగ్రెసు నడిపిస్తుందనే సందేహం ప్రజారాజ్యం వర్గాల్లో వ్యక్తమవుతోంది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెసు వ్యవహారాన్ని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పు పట్టారు. కావాలనే కాంగ్రెసు ఈ నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు. అంతేకాదు, ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెసు వ్యవహారశైలిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నందననే రామచంద్రయ్య ఆ ప్రకటన చేశారని అంటున్నారు.