చంద్రబాబుకు శృంగభంగం తప్పదు: హరీష్ రావు
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో తెలంగాణ నాయకులకు అవమానం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పిస్తూ పార్టీ మహానాడులో తీర్మానం పెట్టాలని నాగం జనార్దన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు పట్టించుకోలేదని, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావును హరికృష్ణ అవమానించారని, తెలుగుదేశం పార్టీలో తెలంగాణ నాయకులకు ఏ మాత్రం గౌరవం లేదని ఆయన అన్నారు.
తెలంగాణపై ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారని, తెలంగాణపై తన వైఖరిని కూడా చెప్పలేక పోతున్నారని, ఈ స్థితిలో ఏం చెప్పి తెలంగాణ ప్రజల ఓట్లు అడుగుతారో తెలియడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పోటీ చేయడానికి ఎజెండా లేదని ఆయన అన్నారు.