వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు ఎసరు

పోలవరం ప్రాజెక్టు వివాదంపై ఇప్పటికే చర్యలు చేపట్టింది. అదే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైయస్ రాజశేఖర రెడ్డి తలపెట్టిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల గొడవలు ముదురుతుండగానే మరో వివాదానికి ప్రభుత్వం తెర తీసింది. దుమ్ముగూడెం - సాగర్ ప్రాజెక్టు అవసరమా, కాదా అనే విషయాన్ని తిరిగి పరిశీలించడానికి ప్రభుత్వం పునుకుంది. పోలవరంతో పాటు దుమ్ముగూడెం ప్రాజెక్టును కూడా తెలంగాణవాదులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గోదావరి - కృష్ణా నదులను అనుసంధాన చేయడానికి దుమ్ముగూడెం - నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడానికే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందనే విమర్సలు వెల్లువెత్తాయి.
గోదావరి జలాలను కోస్తా డెల్టాకు తరలించి, కృష్ణా నదీ జలాలను పూర్తిగా రాయలసీమకు ఉపయోగించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల తెలంగాణకు గోదావరి జలాలు అందకుండా చేయాలని వైయస్ పూనుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ స్థితిలో ఈ ప్రాజెక్టు అవసరమా, కాదా అనే విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం ఓ కమిటీని వేయడానికి పూనుకుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే 391 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలంగాణవాదుల తీవ్ర వ్యతిరేకతకు కారణమైన సాగునీటి ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.












Click it and Unblock the Notifications