డిఎస్, చంద్రబాబులకు చంద్రశేఖర రావు కొత్త సవాల్
గురువారమిక్కడ తెరాస కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గం గంభీర్రావుపేట మండల తెదేపా అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యులు దయాకర్రావు, ఎంపీటీసీ సభ్యులు లింగంయాదవ్, సురేందర్రావు, వనపర్తి నియోజకవర్గం నుంచి పరమేశ్నాయి తదితరులు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డి.శ్రీనివాస్, చంద్రబాబు నాయుడులు ఎన్నికల ముందు పిల్లిమొగ్గలు, కుప్పిగంతులు వేస్తున్నారంటూ ద్వజమెత్తారు. డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రజలు కోరుతున్నపుడు, ఉద్యమానికి అవసరమైనపుడు మాట్లాడలేదని, విద్యార్థులను పోలీసులు గొడ్లను కొట్టినట్టు కొట్టినా నోరు విప్పలేదన్నారు. అలాంటి డీఎస్ ఇప్పుడు తెలంగాణ వచ్చేవరకు నిద్రపోనంటూ బీరాలు పలుకుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి రోశయ్యలు చీకట్లో షేక్హ్యాండ్ ఇచ్చుకుంటారని కేసీఆర్ విమర్శించారు. శాసనసభలో తెరాస లేకపోతే తెలంగాణ అంశాలపై కూడా చర్చించడంలేదని ఆరోపించారు.