సోనియా మండిపాటు: వైయస్ జగన్ పై చర్య ఖాయం
జగన్ వ్యవహారాన్ని సోనియా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఆయనపై చర్య తప్పకపోవచ్చునని అంటున్నారు. బహిరంగ లేఖలో చేసిన జగన్ చేసిన పలు వ్యాఖ్యలు సోనియాను ప్రశ్నించే విధంగా ఉన్నాయని, సోనియాను జగన్ ఢీకొట్టడానికే సిద్ధపడ్డారని భావిస్తున్నారు. జగన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలా, నేరుగా చర్యలు తీసుకోవాలా అనే విషయంపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే జగన్ పై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి.
జగన్ వ్యవహారంపై మొయిలీ నివేదికను కోరామని, ఆ నివేదిక ఆధారంగా జగన్ పై చర్యలుంటాయని ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది చెప్పారు. జగన్ పట్ల ఇప్పటికే చాలా ఉదారంగా వ్యవహరించామని, ఆ ఉదారతను జగన్ తప్పుగా అర్థం చేసుకున్నాడని అధిష్టానం ఆలోచిస్తోంది.