వైయస్ జగన్ పై చంద్రబాబు మౌనం వెనక కారణం..
మధ్యంతర ఎన్నికల గురించి మాట్లాడితే అధికారం కోసం అర్రులు చాస్తున్న అభిప్రాయం కలుగుతుందని చంద్రబాబు మౌనం వహించడానికి ఒక కారణంగా చెబుతున్నారు. జగన్ వ్యవహారంపై గానీ కాంగ్రెసులో తలెత్తిన సంక్షోభంపై గానీ మాట్లాడవద్దని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించినట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ గాలి జనార్దన్ రెడ్డితో వైయస్ జగన్ అక్రమ లావాదేవీలపై ప్రశ్నల వర్షం సంధించారు. అయితే, ఇప్పుడు ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. బయ్యారం గనులను అక్రమంగా వైయస్ అల్లుడు అనిల్ కుమార్ కు కట్టబెట్టారని రాష్ట్ర శాసనసభలో ఆందోళనకు దిగుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ తగిన ఫలితం సాధించడంలో విఫలమైంది.
కాంగ్రెసు అంతర్గత సంక్షోభం తమకు లాభమా, నష్టమా అని చంద్రబాబు బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని దగ్గర చేసుకుని, జగన్ ను దూరం చేసుకోవడానికి కాంగ్రెసు హైకమాండ్ చేస్తున్న ప్రయత్నం ఒక రకంగా చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదని అంటున్నారు. ఈ పరిణామం వల్ల తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లాభపడేది గానీ నష్టపోయేది గానీ ఏమీ ఉండకపోవచ్చు. కానీ కోస్తాంధ్రలో తెలుగుదేశం పార్టీకి నష్టం సంభవించవచ్చునని భావిస్తున్నారు.