ఇషాన్ రెడ్డి శవం చూసి కంట తడి పెట్టిన కెసిఆర్
తమ మృతదేహానికి పోస్టుమార్టం చేయకూడదని సూసైడ్ నోట్ లో రాయడంతో ఇషాన్ రెడ్డి శవానికి పోస్టుమార్టం జరపకూడదని విద్యార్థులు పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇషాన్ రెడ్డి బంధువులు నచ్చజెప్పడంతో విద్యార్థులు వెనక్కి తగ్గారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే వైద్యులు ఇషాన్ రెడ్డి శవానికి నివాళులు అర్పించారు. విద్యార్థులు ఇషాన్ రెడ్డి శవంతో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు అంతిమయాత్ర నిర్వహించడానికి ప్రయత్నించారు. దాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో బిజెపి నేత విద్యాసాగర రావు, కెసిఆర్, ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించారు.
బిజెపి నేత దత్తాత్రేయ, తెరాస నాయకుడు నాయని నర్సింహారెడ్డి ఉస్మానియాకు వచ్చిన ఇషాన్ కు నివాళులు అర్పించారు. అత్మబలిదానాలకు పాల్పడవద్దని నాయని నర్సింహా రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. తాము పోరాడుతున్నదే విద్యార్థుల భవిష్యత్తు కోసమని, తాము తెలంగాణ సాధించి తీరుతామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెసు ప్రభుత్వం తీరును దత్తాత్రేయ విమర్శించారు.