హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ పార్లమెంటు సభ్యులపై సిఎం రోశయ్య ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులపై ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ విషయంలో తన ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ వారు వీధులకు ఎక్కడంపై ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెంది ఉండి తమ ప్రభుత్వ వైఖరిని బహిరంగంగా వ్యతిరేకించడం వల్ల పరువు పోతుందని ఆయన అభిప్రాయపడినట్లు వినికిడి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయుకులతో గొంతు కలపడంతో పాటు వారి కన్నా ఎక్కువగా తమ పార్టీ పార్లమెంటు సభ్యులే దూకుడు ప్రదర్శించారని ఆయన అన్నట్లు సమాచారం. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఈ నెల 5వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగి అరెస్టయిన విషయం తెలిసిందే.

కాగా, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా తెలంగాణ ఎంపిలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. తెలంగాణ ఎంపిలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, తెరాసతో చేతులు కలిపారని, దీనిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తామని వారన్నారు. అయితే, దీనిపై కాంగ్రెసు తెలంగాణ ఎంపిలు ఎదురు దాడికి దిగుతున్నారు. పార్లమెంటు సభ్యుడు వివేక్ నివాసంలో మంగళవారం రాత్రి విందు సమావేశంలో తెలంగాణ ఎంపిలు ఆ విషయాలపై చర్చించినట్లు సమాచారం. సీమాంధ్ర ఎంపిలే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణకు అనుకూలంగా కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటనపై ఆందోళనకు దిగి సీమాంధ్ర నాయకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారంటున్నారు. ఏమైనా, ఎపిపిఎస్సీ పరీక్షతో మరోసారి కాంగ్రెసు ప్రాంతాలవారీగా చీలిపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X