వైయస్ జగన్ కట్టుడి: తెలంగాణకు కాంగ్రెసు గ్రీన్ సిగ్నల్
జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నాయకులపై పార్టీ అధిష్టానం కొరడా ఝళిపించడం ప్రారంభించింది. తొలిసారి ఓ పార్లమెంటు సభ్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి నోటీసు జారీ చేసి స్పష్టమైన సంకేతాలను పంపింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటే సహించేది లేదనేది ఆ సంకేతం. ఆ రకంగా వైయస్ జగన్ ను కట్టడి చేసేందుకు అధిష్టానం కఠినంగా వ్యవహరించేందుకు పూనుకుందని చెప్పవచ్చు. మరోవైపు జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ పార్టీ సీనియర్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. శనివారం కూడా ఆమె తన వ్యాఖ్యలను కొనసాగించారు.
మరోవైపు, తెలంగాణ పార్టీ నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ లో తెలంగాణ కాంగ్రెసు నాయకులు త్యాగధనుల సభను నిర్వహించారు. ఈ సభలో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు పాల్గొన్నారు. ఆ రకంగా తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సంకేతాలను పంపుతోందని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఆశీస్సులతోనే ఈ సభ జరిగినట్లు భావిస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులు లేకపోతే ఇంతగా కాంగ్రెసు నాయకులు సభలో పాల్గొని ఉండేవారు కాదని అంటున్నారు. అందుకు తగినట్లుగానే సీనియర్ కాంగ్రెసు నేత కె. కేశవరావు ప్రకటనలు ఉన్నాయి. డిసెంబర్ 9వ తేదీన్నే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చేశారని కేశవరావు శనివారం సిద్ధిపేటలో చెప్పారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు లక్ష రూపాయలేసి ఆర్థిక సాయం అందించే కార్యక్రమం కూడా పార్టీ తరఫుననే జరుగుతుందని కాంగ్రెసు తెలంగాణ నాయకులు చెబుతున్నారు. దీన్ని బట్టి అటు జగన్ పై ఒత్తిడి తెస్తూ ఇటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.