తెలంగాణలో వైయస్ జగన్ క్యాంప్ వ్యూహం ఏమిటి?

గుంటూరులో నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి ప్రకటనను చూసినా ఆ విషయం తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో వైయస్ అభిమానులున్నారని, వైయస్ వ్యతిరేకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణపై మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. వ్యూహాత్మకంగానే ఆయన అలా అన్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణను తాము వ్యతిరేకించడం లేదంటూ తమ ద్వారా వైయస్ జగన్ ను తెలంగాణలో అడుగు పెట్టించాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. క్రమక్రమంగా వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు తెలంగాణలో కోమటి రెడ్డి మాదిరిగానే ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వైయస్ వ్యతిరేకులను గట్టిగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నట్లు చెప్పవచ్చు.
తెలంగాణకు చెందిన నాయకులే కాకుండా సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు కూడా తెలంగాణలో వైయస్ అభిమానులున్నారని పదే పదే వాదిస్తున్నారు. తెలంగాణలో ఇంటింటా వైయస్ బొమ్మలున్నాయని అంటున్నారు. ఈ వాదనకు మరింత ప్రచారం కల్పించడం ద్వారా వైయస్ జగన్ కు వ్యతిరేకతను తగ్గించాలని చూస్తున్నారు. ప్రజలు జగన్ ను వ్యతిరేకించడం లేదని, కాంగ్రెసులోని వైయస్ వ్యతిరేకులే అడ్డు తగులుతున్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ వాదనను మరింత బలంగా ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications