ఓయు పోలీస్ స్టేషన్ ముట్టడించి రాళ్లు రువ్విన విద్యార్థులు, ఉద్రిక్తం

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఈ విషయమై ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని ఓయు ఐకాస నాయకుడు సుమన్ డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులైన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణ కమిటీని తప్పుదోవ పట్టించే యత్నాలు చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చేతకాని దద్దమ్మల్లా కూర్చున్నారన్నారు. డిజిపి అరవిందరావు నియంతృత్వధోరణిని వారు అడ్డుకోలేక పోతున్నారన్నారు. ఇక్కడ విద్యార్థులను పోలీసులు చితకబాదుతుంటే తెలంగాణ మంత్రులు కాంగ్రెస్ 125వ సంవత్సర వేడుకలంటున్నారని విమర్శించారు. ఎస్ఐ పరీక్షలతో పాటు, బిఇడి, పారామెడికల్ విద్యార్థుల గోస పట్టననట్టు వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రులు దున్నపోతుమీద వానపడ్డట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇంతవరకు మేం శాంతియుతంగా ఉద్యమం చేసినప్పటకీ ప్రభుత్వం, పోలీసులు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నరన్నారు. మా సహనం నశిస్తోంది, మా ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వం, మంత్రులు ఇలాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పోలవరంపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లిన ముఖ్యమంత్రి ఫ్రీజోన్ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకు పోవడం లేదని ప్రశ్నించారు. ఆ బాధ్యత రోశయ్యది కాదా అని అన్నారు.












Click it and Unblock the Notifications