వైయస్ జగన్ ఆశలను వమ్ము చేసిన సోనియా: కాంగ్రెసు దాడి ఉధృతం

హైదరాబాద్: వైయస్ జగన్ ఆశలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నీళ్లు చల్లారు. మంత్రి పదవులు దక్కనివారు, శాఖల కేటాయింపుపై అలక వహించినవారు తన వైపు వస్తారని వైయస్ జగన్ ఆశించారు. శాఖ కేటాయింపుపై అసంతృప్తికి గురై రాజీనామా చేసిన వట్టి వసంతకుమార్ కు వైయస్ జగన్ స్వయంగా ఫోన్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ వారెవరూ జగన్ వైపు చూడలేదు. అతి సులభంగా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సోనియా గాంధీ అడిగిందే తడవుగా రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు, మంత్రులకు అపాయింట్ మెంట్లు ఇస్తూ వెళ్లారు. వరుసగా ఒక్కరొక్కరినే కలుసుకుంటూ వారిని దారికి తెచ్చారు. మంత్రి పదవులు ఆశించిన జెసి దివాకర్ రెడ్డికి, శాఖల కేటాయింపుపై అలక వహించిన వట్టి వసంతకుమార్ వంటి మంత్రులకు ఆమె నచ్చజెప్పారు. అసంతృప్తితోనైనా సరే, వారు కాంగ్రెసులోనే కొనసాగాలని నిర్ణయించుకోవడం వైయస్ జగన్ కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. శాఖల కేటాయింపులపై అలక వహించిన బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లను కూడా నయానా భయానా దారికి తెచ్చారు. దీంతో వైయస్ జగన్ వైపు చూసే అవకాశాలు లేకుండా పోయాయి.

కాంగ్రెసు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి చెంది రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావును కూడా తన వైపు లాక్కునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా ఫలిస్తుందా, లేదా అనేది అనుమానమే. రాష్ట్రంలో మరో కొత్త ప్రాంతీయ పార్టీకి వెసులుబాటు లేదనే అభిప్రాయం మెండుగా ఉంది. చిరంజీవిలాంటి ఇమేజ్ ఉన్న నాయకుడు పార్టీ పెడితేనే దేనికీ కాకుండా పోయారు. కాంగ్రెసు వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, వైయస్ జగన్ తో వెళ్లడం వల్ల పుట్టి మునుగుతుందో, తేలుతుందో తెలియని పరిస్థితి. వైయస్సార్ పై ఉన్న అభిమానాన్ని, ఆర్థిక బలాన్ని చూసి మాత్రమే జగన్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పైగా, ఎన్నికలు రావడానికి ఇంకా మూడున్నరేళ్ల వ్యవధి ఉంది. ఇప్పుడే వెళ్లి చేతులు కాల్చుకోవడం ఎందుకనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. పైగా, కాంగ్రెసులో ఉంటే వైయస్ జగన్ ను సమర్థించడానికి చాలా మందే ఉన్నారు. బయటకు వెళ్తే మాత్రం ఆయన దారి పట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. కాంగ్రెసును కాదంటే ఎదురయ్యే పరిస్థితిని గత నాయకుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటున్నారు.

ఇదిలా వుంటే, వైయస్ జగన్ పై కాంగ్రెసు నాయకులు దాడిని ఉధృతం చేశారు. వి. హనుమంతరావు వంటి ప్రత్యర్థులు మాత్రమే కాకుండా తులసిరెడ్డి వంటి నాయకులు కూడా వైయస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకోవడం వీరికి బాగా కలిసి వస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి చేసిన త్యాగాన్ని గుర్తు చేస్తూ మంత్రి పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోవాలని అనడం, అది కుటుంబాన్ని చీల్చడంగా చెప్పడం జగన్ వ్యవహారశైలిని తప్పు పడుతున్నారు. వైయస్ జగన్ సంపాదనపై గురి పెడుతున్నారు. అనతి కాలంలోనే వైయస్ జగన్ అంత పెద్ద మొత్తంలో ఎలా డబ్బులు సంపాదించారని ప్రశ్నిస్తున్నారు. తనది సచ్ఛీలత అని చెబుకుంటున్న వైయస్ జగన్ తప్పు పట్టడానికి సంపాదనను ముందుకు తెస్తున్నారు. కాంగ్రెసులో ఉండడం వల్లనే ఇన్నాళ్లు వైయస్ జగన్ వ్యవహారాలపై మాట్లాడలేదని, ఇప్పుడు మాట్లాడక తప్పడం లేదని వారంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసు కుంభకోణాలమయంగా మారిందన్న వైయస్ జగన్ ఆరోపణలు కూడా ఆయనపైనే తిరగబడుతున్నాయి. రాష్ట్రంలో వైయస్ జగన్ కుంభకోణాల వ్యవహారాలు కూడా ముందుకు రావాలని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+