కిరణ్ కుమార్ కు షాక్: అసంతృప్తులకు వైయస్ జగన్ గాలం

వైయస్ జగన్ శిబిరానికి చెందిన నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ వైపు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న నాయకులతో వైయస్ జగన్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. కృష్ణా జిల్లా పరిణామాలు బయటకు కనిపిస్తున్నప్పటికీ ఇతర జిల్లాలోనూ లోలోపల చురుగ్గా పావులు కదులుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో పి. జనార్దన్ రెడ్డి కుమారుడు, శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డితో వైయస్ జగన్ అనుచరులు మాట్లాడినట్లు సమాచారం. తనను పార్టీ సమావేశాలకు పిలవకపోవడం పట్ల, తనను గుర్తించకపోవడం పట్ల ఆయన విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జిల్లాలో సంచలనాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్న సమయంలోనే విశాఖపట్నం జిల్లాలో సబ్బం హరి, కొణతాల రామకృష్ణ సమావేశమై వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ఖరారు చేశారు. వైయస్ జగన్ తరఫున కరుణాకర్ రెడ్డి లోపల విస్తృతంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చిత్తూరు జిల్లాలో మండలాలవారీగా నాయకులతో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలో వైయస్ జగన్ వర్గీయులు ముమ్మరంగా పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్న శాసనసభ్యురాలు కుతూహలమ్మను కూడా తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. జిల్లాలవారీగా వైయస్ జగన్ ఆకర్ష్ పథకం పకడ్బందీగా అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications