కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు: తాజాగా నలుగురు మృతి

అతివృష్టివల్ల ఆశించిన దిగుబడి రాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూరు మండలం భుతాయి(బి) గ్రామంలో కరాడ్ బాలు(35) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కౌలు రైతు కాకర్ల చిన నరసింహారావు(50) మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి వేయగా, వర్షానికి నీట మునిగింది. మిగిలిన పంటను కోసేందుకు కూలీలు దొరకలేదు. ఈ పరిణామాలతో కుంగిపోయిన ఆయన శనివారం పొలంలోనే పురుగుమందు తాగారు. ఇదే జిల్లా పడమటి మోరవాగుపాలెంకు చెందిన రైతు శ్రీనివాసరెడ్డి భార్య దొంతిరెడ్డి విజయలక్ష్మి(32) పంట నష్టం, అప్పులపై ఆందోళనతో శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.
కృష్ణా జిల్లాలో ఇద్దరు కౌలు రైతులు గుండెపోటుతో మరణించారు. వీరిలో వీరులపాడు మండలం అల్లూరువాసి కందుల వందనం(38), అవనిగడ్డ శివారు కొత్తపేటకు చెందిన గరికపాటి ప్రభాకర్(48) ఉన్నారు. ముదినేపల్లి మండలం దేవపూడి రైతు నారగాని పాండురంగారావు(22) పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కరీంనగర్ జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన అంబాల కిష్టయ్య(38) అనే రైతు గుండెపోటుతో మృతిచెందారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కృష్ణా జిల్లా రైతు తిరుపతిరావు మృతదేహంతో శనివారం విజయవాడలో తెదేపా ధర్నా నిర్వహించింది. బాధిత రైతు కుటుంబానికి తక్షణం న్యాయం చేయాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. విజయవాడ రూరల్ మండలం కొత్తూరుకు చెందిన తిరుపతిరావు శుక్రవారం బలవంతంగా తనువు చాలించారు.












Click it and Unblock the Notifications