ఖమేనీ అంత్యక్రియలకు మోదీ దూరం.. ఎందుకంటే!
ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా సయ్యద్ అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకావడం లేదు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పీఎం మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనల్లో బిజీగా ఉండటమే దీనికి కారణమని నివేదికలు చెబుతున్నాయి. అయితే, భారత ప్రభుత్వం తరఫున ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ అంత్యక్రియల్లో పాల్గొననుంది.
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నుంచి అందిన అధికారిక ఆహ్వానం మేరకు.. భారత్ తరఫున బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఇరాన్ వెళ్లనున్నారు. జూలై 4 నుంచి టెహ్రాన్లో ప్రారంభం కానున్న ఈ అంత్యక్రియల కార్యక్రమాల్లో వీరిద్దరూ అధికారికంగా పాల్గొంటారు. మిడిల్ ఈస్ట్ వ్యవహారాలు, కౌంటర్ టెర్రరిజంలో అపార అనుభవం ఉన్న మాజీ ఆర్మీ అధికారి హస్నైన్ను, అలాగే విదేశాంగ శాఖ మంత్రిని పంపడం ద్వారా ఇరాన్తో భారత్కు ఉన్న వ్యూహాత్మక, దౌత్యపరమైన సంబంధాల ప్రాధాన్యతను చాటిచెప్పినట్లయింది.

ఇజ్రాయెల్, అమెరికా దాడిలో ఖమేనీ మృతి
గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ (86) మరణించారు. 1989 నుంచి ఇరాన్ను నడిపిస్తున్న ఆయన మృతి ఆ దేశానికి పెద్ద దిగ్భ్రాంతిని కలిగించింది. తాజాగా జూలై 4న టెహ్రాన్లో అంత్యక్రియల వేడుకలు ప్రారంభం కానుండగా.. జూలై 9న ఆయన స్వస్థలమైన మష్హాద్లో ఖనన సంస్కారాలు జరగనున్నాయి. అప్పట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల (యుద్ధం) కారణంగా ఈ అంత్యక్రియలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ వీడ్కోలు వేడుకకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ప్రజలు తరలివస్తారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్తో భారత్ బలమైన బంధం
ఖమేనీ మరణం తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి దిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇటీవల జరిగిన 40 రోజుల సుదీర్ఘ ఘర్షణల సమయంలోనూ పీఎం మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నిరంతరం ఇరాన్ నాయకత్వంతో టచ్లో ఉన్నారు. ఇరాన్ను తన "పొడిగించబడిన పొరుగుదేశం" (Extended Neighbourhood) గా భావించే భారత్.. గతంలో 2024లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించినప్పుడు కూడా అప్పటి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ను పంపి తమ సత్సంబంధాలను చాటుకుంది. ఈ అంత్యక్రియలకు భారత్తో పాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు.














Click it and Unblock the Notifications